అక్షరటుడే, వెబ్డెస్క్: సినీ పరిశ్రమపై పగబట్టినట్లుగా సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అల్లు అర్జున్ పై సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతిని అందరూ ఖండించారన్నారు. బాలుడు శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీలో సినిమా తరహా కథ అల్లి సీఎం మళ్లీ సమస్యను సృష్టించారని బండి సంజయ్ విమర్శించారు. అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేశారని వ్యాఖ్యానించారు. నటుడు అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఎంఐఎంను నమ్మితే కాంగ్రెస్కూ బీఆర్ఎస్ గతే పడుతుందని పేర్కొన్నారు. కలుషిత ఆహారం తిని గురుకుల విద్యార్థులు చనిపోతున్నారని.. వారి కుటుంబాలను సీఎం ఏనాడైనా పరామర్శించారా.. అని ప్రశ్నించారు. మీకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా?.. ఇకనైనా రేవంత్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement