అక్షరటుడే, ఇందూరు: Congress | మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోబోమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. జవహర్ నవోదయపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇంకా స్థల సేకరణ చేపట్టలేదని, కేవలం ప్రతిపాదనలు మాత్రమే వెళ్లాయన్నారు. అప్పుడే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై నోరు పారేసుకోవడం తగదన్నారు.
మంత్రిగా ఉన్నప్పుడు సుదర్శన్ రెడ్డి జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. మెడికల్ కళాశాల, గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల తదితర అభివృద్ధి పనులు కనబడలేదా అని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ తన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలని విమర్శించారు. అనంతరం నూడా ఛైర్మన్ కేశ వేణు మాట్లాడారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పగంగారెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి, జావెద్ అక్రం తదితరులు పాల్గొన్నారు.