అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే వారికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(APTA) నేతృత్వంలో హైదరాబాద్లో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. హైదరాబాద్లో పెట్టుబడులకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని, ఒక స్పష్టమైన విధానంతో వచ్చినప్పుడు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ఇలా చెప్పుకొంటూ పోతే పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయని సీఎం వివరించారు. పెట్టుబడులకు ప్రభుత్వం తరఫున సంపూర్ణమైన విశ్వాసాన్ని, రక్షణను కల్పిస్తామని చెప్పారు. ఈ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు రావాలని, పరిశ్రమలు నెలకొల్పాలని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
ఎనర్జీ పాలసీకి ఆమోదం
ప్రభుత్వం ఈ మధ్యకాలంలో టూరిజం పాలసీని తీసుకురాగా, ఎనర్జీ పాలసీకి ఈరోజు మంత్రి మండలి సమావేశంలో ఆమోదం తెలిపినట్టు సీఎం చెప్పారు. హైదరాబాద్ నగరం కూడా గ్లోబల్ సిటీగా న్యూయార్క్, లండన్, టోక్యో వంటి ప్రముఖ నగరాలతో పోటీపడి అభివృద్ధి చెందాలని ఒక పట్టుదలతో ప్రభుత్వం పనిచేస్తుందని.. అందులో భాగస్వాములు కావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నానని చెప్పారు.