అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘క్యాష్ లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్’ పేరిట కొత్త స్కీమ్ ను ప్రకటించింది. దీని ప్రకారం.. ప్రమాదం జరిగిన 24 గంటల్లో బాధితుడికి 7 రోజుల చికిత్స ఖర్చు కానీ, గరిష్టంగా రూ. 1.5 లక్షలు కానీ వెంటనే అందజేస్తారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేసిన తర్వాతే చికిత్స కోసం నగదు ఇస్తారు. హిట్ అండ్ రన్ లో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షలు అందజేయనున్నారు. ఈ మేరకు పలు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులతో మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమావేశమయ్యారు. అనంతరం ఢిల్లీలోని భారత్ మండపంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ..”రోడ్డు భద్రతకే మా మొదటి ప్రాధాన్యం. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.8 లక్షల మంది చనిపోయారు. అందులో 30 వేల మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే మృతి మరణించారు. మృతుల్లో 66శాతం మంది 18 – 34 ఏళ్ల మధ్య వయస్సు గలవారే” అని వివరించారు. “స్కూళ్లు, కాలేజీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు సరిగ్గా లేకపోవడం వల్ల జరిగిన ప్రమాదాల్లో 10 వేల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు వెహికల్ నడపడం వల్ల జరిగిన ప్రమాదాల్లో సుమారు 3 వేల మంది మరణించారు” అని నితిన్ గడ్కరీ వివరించారు. రోడ్డు ప్రమాద బాధితులను దృష్టిలో ఉంచుకుని ‘క్యాష్ లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్’ స్కీమ్ తెచ్చామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా పలు రాష్ట్రాల్లో అమలు చేసి సక్సెస్ అయ్యామన్నారు. ఇక దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. దేశంలో 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని తెలిపారు. ఈ కొరతను తీర్చేందుకు కొత్త విధానాన్ని సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మన దేశం నాలుగు నెలల క్రితమే ఆటోమొబైల్ రంగంలో జపాన్ ను వెనుకకు నెట్టి మూడో స్థానానికి చేరిందని, స్క్రాపింగ్ వల్ల ఆటోమొబైల్ రంగం బాగా అభివృద్ధి చెందుతోందని గడ్కరీ వెల్లడించారు.