అక్షరటుడే, వెబ్డెస్క్: కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ఎదుట బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ)-1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు జరిపేలా వాదనలు ఉండాలన్నారు. రాష్ట్ర నీటి పారుదల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
♦️ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం (ఏపీఆర్ఏ)-2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేపట్టాలి. ఏపీఆర్ఏ ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సైతం సెక్షన్ 3 ఆధారంగా నీటి పంపకాలు రెండు రాష్ట్రాల మధ్య చేపట్టాలని సూచించారు. కేడబ్ల్యూడీటీ-II తదుపరి విధివిధానాల (ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి స్టే ఇవ్వదన్నారు.
♦️ ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి-బానకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు గోదావరి, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు (జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ) తెలంగాణ తరఫున అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాయాలని సూచించారు.
♦️ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా, ఏ నదిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీలతో పాటు పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని లేఖల్లో ప్రస్తావించాలన్నారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ముంపు విషయంపై హైదరాబాద్ ఐఐటీతో అధ్యయనం చేయించే అంశాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయించాలని ఆదేశించారు.
♦️ సమ్మక్క సారక్క బ్యారేజీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు(నీటి పారుదల) ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.