అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: ఏటీఎంలో నగదు తీసుకోడానికి వచ్చిన రైతును ఏమార్చి ఓ వ్యక్తి రూ.30 వేలు స్వాహా చేశాడు. మోపాల్​ మండలం నర్సింగ్​పల్లి గ్రామానికి చెందిన చిన్నొళ్ల గంగారెడ్డి మంగళవారం నిజామాబాద్​ కు వచ్చాడు. డబ్బులు డ్రా చేయడానికి రైల్వే స్టేషన్​ ప్రాంతంలోని ఎస్​బీఐ ఏటీఎంలోకి వెళ్లాడు. తాను తీస్తే ఏటీఎంలో నుంచి డబ్బు రాకపోవడంతో అక్కడే ఉన్న వ్యక్తి సాయం తీసుకున్నాడు. ఆ వ్యక్తి రూ.ఐదు వేలు ఏటీఎం నుంచి తీసి ఇచ్చాడు. అనంతరం గంగారెడ్డికి వేరే ఏటీఎం కార్డు ఇచ్చాడు. అది గమనించకుండా వెళ్లిన ఆయనకు కొద్ది సేపటి తర్వాత ఖాతాలో నుంచి డబ్బులు డ్రా అయినట్లు మేసేజ్​ వచ్చింది. కార్డు మార్చిన దుండగుడు గంగారెడ్డి అకౌంట్​ నుంచి రూ.30 వేలు డ్రా చేశాడు. దీంతో బాధితుడు ఒకటో టౌన్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.