అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్‌ అరెస్ట్‌ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. మంగళగిరిలో సోమవారం మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. సంధ్య థియేటర్‌ అంశాన్ని గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు. ఘటన విషయంలో ముందూ వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్‌ని ఒంటరి చేశారని వ్యాఖ్యానించారు. అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుందన్నారు. ఈ విషయంలో పోలీసుల తీరును తప్పుబట్టను అని పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్‌ రెడ్డి పాలన బాగుందని ప్రశంసలు కురిపించారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో అభిమాని మృతి చెందిన వెంటనే బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్‌ పరామర్శించి ఉండాల్సిందన్నారు. సీఎం పేరు చెప్పలేదని అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేశారనడం కరెక్ట్‌ కాదన్నారు. అర్జున్‌ స్థానంలో రేవంత్‌రెడ్డి ఉన్నా అలాగే అరెస్ట్‌ చేస్తారని పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని చెప్పారు.