అక్షరటుడే, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈనెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని ప్రకటించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ‘ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని గతంలో ఆదేశాలిచ్చాం. కొంతమంది ఇంకా ఆఫీసులకే పరిమితమవుతున్నారు. జనవరి 26 తర్వాత స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తా. నిర్లక్ష్యం వహించిన వారి పట్ల కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ‘ప్రభుత్వం పేదల కోసం గొప్పగా పనిచేస్తోందని ప్రజల్లో నమ్మకం కలిగించాలి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా వసతి గృహాలను సందర్శించి అక్కడే బస చేయాలి’ అని ఆదేశించారు.
రిపబ్లిక్ డే నుంచి పథకాల అమలు
సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా చెల్లించాలని, వ్యవసాయానికి పనికి రాని భూములను గుర్తించి వాటిని రైతు భరోసా నుంచి మినహాయించాలని ఆదేశించారు. ఈ పథకాలు జనవరి 26 న రిపబ్లిక్ డే నుంచి అమలు చేయాలని చెప్పారు.
గ్రామ, వార్డు సభలు..
ఈ నాలుగు పథకాల అమలు కోసం రాష్ట్రంలోని అన్ని పల్లెల్లో గ్రామసభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించేందుకు వెంటనే సన్నాహాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ‘ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించాలి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవడంతో పాటు విలేజ్ మ్యాప్లను పరిశీలించడం, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని ధ్రువీకరించుకోవాలి’ అని సూచించారు.
ఉపాధి కూలీలకే ఆత్మీయ భరోసా
‘భూమి లేని నిరుపేద ఉపాధి కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించాం. ఆ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేల నగదు సాయం అందించాలి. ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది’ అని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ‘వన్ స్టేట్ – వన్ రేషన్’
‘రాష్ట్రంలో ‘వన్ స్టేట్ – వన్ రేషన్’ విధానాన్ని అమలు చేయబోతున్నాం. తెలంగాణలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలి. ఈ నెల 11 నుంచి 15 లోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేసుకోవాలి’ అని సీఎం పేర్కొన్నారు.
గూడులేని అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం
‘గూడులేని నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించాం. అందులో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యమివ్వాలి. తొలి విడత నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేశాం’ అని సీఎం చెప్పారు.