అక్షరటుడే, ఇందూరు: ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు పేర్కొన్నారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో సిబ్బందికి మొదటి విడత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవోలు, ఏపీవోలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి సందేహాలున్నా శిక్షణ తరగతల్లో మాస్టర్ట్రైనర్ల ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఎక్కువ సమయం పడుతుందని ఓపికగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. మాస్టర్ ట్రైనర్లు హన్మాండ్లు, వర్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఆర్డీవో రాజేంద్రకుమార్, రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల తహశీల్దార్లు, పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు పాల్గొన్నారు.
