అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: జైలుకు వెళ్లి వచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్రంలో నేరాలు పెరిగాయని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే నేరాలు అధికంగా జరిగాయని విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుట్కా, అక్రమ బియ్యం, లిక్కర్‌ దందా చేసింది ఎవరో జనాలకు తెలుసన్నారు. గాలి మాటలు తమకు రావని, అభివృద్ధి చేసి చూపిస్తున్నామని పేర్కొన్నారు. నగరాభివృద్ధికి టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.60 కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. సంక్రాంతికి రైతు భరోసా అందిస్తామని, పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని చెప్పారు.